ఖమ్మంవ్యవసాయం: పత్తి సాగు చేసిన రైతులకు అండగా నిలవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లు చేపట్టగా.. ఇందుకోసం తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) జారీచేసే క్రమాన అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈమేరకు దళారులకు కొందరు అధికారులు అండగా నిలవడంతో రైతులకు మద్దతు ధర దక్కకపోగా వారి వద్ద తక్కువ ధరకు పత్తి సేకరించిన మధ్యవర్తులు మాత్రం కాసులు దండుకున్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు చేపడుతున్న విచారణలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి.
ఏమిటీ టీఆర్..
సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు వ్యవసాయ శాఖ రూపొందించిన పంట నమోదు ప్రక్రియను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. అయితే పంట కొనుగోలు సమయానికి పంట నమోదు పూర్తి కాకపోవడంతో అవరోధం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల (టీఆర్) విధానాన్ని అమలుచేశారు. టీఆర్ పుస్తకాలను మార్కెటింగ్ శాఖ ముద్రించి వ్యవసాయ శాఖకు అప్పగించగా.. ఏఓలు, ఏఈఓలు రైతుల సాగు విస్తీర్ణాన్ని ధ్రువీకరించి పత్రాలు జారీచేశారు. వీటి ఆధారంగా సీసీఐ పత్తి సేకరించింది.
అక్రమాలు ఇలా..
జిల్లాలోని ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, వైరా, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ల పరిధిలో తొమ్మిది జిన్నింగ్ మిల్లుల ఆధారంగా 4.50 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. అయితే, మార్కెటింగ్ శాఖ ప్రింట్ చేసిన టీఆర్ బుక్స్ను వ్యవసాయ శాఖ ఉద్యోగులు రైతుల సాగు విస్తీర్ణం ఆధారంగా అందించాలి. కానీ, కొందరు రైతుల నుంచి దళారులు క్వింటా పత్తిని రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున కొనుగోలు చేసి.. వ్యవసాయ శాఖ ఉద్యోగులను మచ్చిక చేసుకోవడం ద్వారా బినామీ పేర్లతో టీఆర్లు తీసుకున్నారు. ఆపై సీసీఐ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ.7,521కు క్వింటా చొప్పున పత్తి విక్రయించారు. ఫలితంగా రైతులకు బదులు వ్యాపారులకు లబ్ధి జరగడమే కాక ఉద్యోగులకూ వాటాలు అందినట్లు సమాచారం. ఈ విషయమై అందిన ఫిర్యాదులతో ప్రభుత్వం విజిలెన్స్ విభాగంతో విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీసీఐ వద్ద జాబితాల ఆధారంగా కొందరు రైతులను కలిసి సాగు వివరాలు, ఆధార్ నంబర్లు సేకరించడంతో అక్రమాలు నిజమేనని తేలింది. ఆపై జిల్లాల్లోని మార్కెటింగ్ శాఖలోనూ తనిఖీ చేస్తుండగా ఖమ్మం జిల్లాకు సైతం విజిలెన్స్ అధికారులు వచ్చారు. మొత్తంగా ముద్రించిన టీఆర్ పుస్తకాలు ఎన్ని, అందులో వ్యవసాయ శాఖకు ఎన్ని అప్పగించారు.. రైతులకు జారీ చేసినవి పోగా ఇంకా ఎన్ని మిగిలాయనే వివరాలు ఆరా తీస్తుండగా స్పష్టత రాలేదు. దీంతో మార్కెటింగ్ శాఖ విడుదల చేసిన టీఆర్ పుస్తకాలే కాక వ్యాపారులు కొందరు నకిలీ టీఆర్లను ముద్రించినట్లు గుర్తించారని సమాచారం. దీంతో పూర్తిస్థాయి లెక్కలు తేల్చడంపై దృష్టి సారించారు. ఈ వ్యవహారం జిల్లాలోని పలువురు ఉద్యోగులు, వ్యాపారుల్లో దడ పుట్టిస్తోంది.
త్వరలోనే వెల్లడిస్తాం..
ఈవిషయమై జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీంను వివరణ కోరగా.. అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మొత్తం టీఆర్లు ఎన్ని, అందులో వ్యవసాయ శాఖకు ఇచ్చినవి, వినియోగించినవి పోగా మిగిలినవెన్నో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
పత్తి కొనుగోళ్లలో బినామీ పేర్లతో
టీఆర్ల జారీ
కొన్నిచోట్ల నకిలీ టీఆర్లు
రూపొందించినట్లు అనుమానాలు
లెక్కలు తేల్చడంలో నిమగ్నమైన
విజిలెన్స్ అధికారులు