
గులాబీల్లో సంబురం
బీఆర్ఎస్ రజతోత్సవానికి పార్టీ శ్రేణులు సిద్ధం
● సభ విజయవంతానికి జిల్లాలో విస్తృత ప్రచారం ● శ్రేణుల తరలింపునకు భారీ సంఖ్యలో వాహనాలు ● నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి గులాబీదండు కదలుతోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగే సభకు జిల్లా నుంచి 50వేల మందిని తరలించేలా పార్టీ నేతలు వెయ్యికి పైగా బస్సులు, కార్లను ఏర్పాటు చేశారు. ఇవేకాక పార్టీ నేతలు, శ్రేణులు సొంత వాహనాల్లోనూ బయలుదేరనున్నారు. సభ విజయవంతానికి ముఖ్యనేతలు కొన్నాళ్లుగా విస్తృత ప్రచారం చేయడమే కాక పార్టీ శ్రేణులు, జనాన్ని తరలించే బాధ్యతలను పలువురికి అప్పగించారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
జిల్లా వాహనాల
పార్కింగ్కు స్థలం
ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లే వారికి ఇప్పటికే మార్గాలు సూచించగా.. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వెళ్లే వారికి కరుణాపురం నుంచి ఎన్హెచ్ 163 టోల్గేట్ దాటాక పార్కింగ్ కేటాయించారు. ఇల్లెందు, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల నుంచి సభకు వెళ్లే వారు మామునూరు నుంచి నాయుడు పెట్రోల్పంప్, టయోటా షోరూమ్, కడిపికొండ బ్రిడ్జి, మడికొండ, ఎన్హెచ్ 163 బైపాస్, టోల్గేట్, దేవన్నపేట, మడిపల్లి, అనంతసాగర్ మీదుగా కేటాయించిన పార్కింగ్ స్థలానికి చేరాల్సి ఉంటుంది.
ఫ్లెక్సీలు, పోస్టర్లు
ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి జిల్లా నేతలు విస్తృత ప్రచారం చేశారు. వాల్ రైటింగ్తో పాటు సమావేశాలు నిర్వహించడమే కాక ఫ్లెక్సీలు, పోస్టర్లతో సభ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మాజీమంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమావేశాలు నిర్వహించి సభ విజయవంతంపై దిశానిర్దేశం చేశారు.
నాడు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఆవిర్భవించిన సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 2023 జనవరి 18న రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో కలెక్టరేట్ ప్రారంభం తర్వాత, అక్కడి సమీపంలోనే ఈ సభ నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలు భగవంత్సింగ్ మాన్, కేజ్రీవాల్, పినరయ్ విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తదితరులు పాల్గొన్నారు. భారీగా నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభలో బీజేపీ విధానాలపై కేసీఆర్ నిప్పులు చెరగగా.. ఎల్కతుర్తి సభలో ఆయన ప్రసంగం ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.
సభను విజయవంతం చేయాలి..
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతంలో పాలు పంచుకోవాలి. జనం వెళ్లేలా బస్సులు, కార్లు ఏర్పాటుచేశాం. తెలంగాణ సాధన, రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్కే సాధ్యమైంది. ఇది రజతోత్సవ సభగానే కాక రాష్ట్ర సాధన తర్వాత ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశంగా ఉంటుంది.
– పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి
ఖమ్మం సత్తా చాటుదాం..
కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతోంది. ఈ నేపథ్యాన ఎల్కతుర్తి సభకు గులాబీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు, ప్రజలు భారీగా హాజరై కేసీఆర్కు మద్దతు ప్రకటించాలి. ఇక్కడి నుంచి అత్యధికంగా జనం వెళ్లడం ద్వారా జిల్లా సత్తా చాటాలి.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు

గులాబీల్లో సంబురం

గులాబీల్లో సంబురం