● రూ.63 లక్షల నగదు జప్తు చేసిన
సీఐడీ అధికారులు
బనశంకరి: కేపీఎస్సీ పశువైద్యాధికారులతో పాటు వివిధ నియామకాల్లో చోటు చేసుకున్న భారీ అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ గంగ్వార్, బసవరాజ కన్నాళే సంబంధాలపై సీఐడీ దర్యాప్తును బహిర్గతం చేసింది. 2024లో జ్ఞానేంద్రకుమార్ గంగ్వార్ కేపీఎస్సీ పరీక్షల విభాగం కంట్రోలర్గా బాధ్యతలు స్వీకరించిన తక్షణం పాత స్నేహితుడు బసవరాజ కన్నాళేతో కేపీఎస్సీ అక్రమాలు, ప్రశ్నాపత్రం లీకేజీ, అభ్యర్థులతో డీల్ కుదుర్చుకోవడంపై అధికారికి సర్దిచెప్పడంలో కన్నాళే విజయం సాధించారు. విజయకుమార్ గంగ్వార్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ విమాన ప్రయాణానికి సుమారు రూ.11 లక్షల ఖర్చును భరించినట్లు వెలుగులోకి వచ్చింది. బసవరాజ కన్నాళే అభ్యర్థుల నుంచి సేకరించిన డబ్బును బినామీ అకౌంట్లకు బదిలీ చేశారు. అక్రమ నగదు కార్యకలాపాల కోసం బీదర్లో ఓంశ్రీ లక్ష్మీ సౌహార్ద సొసైటీతో పాటు వివిధ బ్యాంకుల్లో కన్నాళే నిర్వహిస్తున్న 13 బినామీ బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.63 లక్షల నగదును సీఐడీ అధికారులు జప్తు చేశారు. అంతేగాక సంజయ్నగరలోని నివాసంపై సీఐడీ అధికారులు దాడి చేసి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నాయకుల వల్లే ఎన్నికల వ్యవస్థ బలహీనం
● మాజీ సీఎం సిద్దరామయ్య
తుమకూరు: రాజకీయ నాయకుల వల్లే ఎన్నికల వ్యవస్థ క్షీణించిందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. శుక్రవారం శ్రీదేవి కళాశాలలో చిత్రకారుడు పీ.ఆర్.తిప్పేస్వామి సమగ్ర సాహిత్య సంకలనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘నేను తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, ప్రజలు నాకు డబ్బులు ఇచ్చి, ఓట్లు వేసి నన్ను గెలిపించారు. అలాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. అది క్షీణించిపోయింది. ఎన్నికల వ్యవస్థ ఖరీదైనదిగా మారిందన్నారు. అందుకే మంచివాళ్లు రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ కారణంగానే భవిష్యత్ పరిస్థితులపై ఆధారపడినా నేను ఎన్నికల్లో పోటీ చేయనని అనేక వేదికలపైనా, కార్యక్రమాల్లోనూ చెప్పాను,‘ అని ఆయన అన్నారు. చిత్రకారుడు తిప్పేస్వామి చిత్రలేఖనం, సాహిత్యం, పరిశోధన రంగాల్లో అసాధారణ కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పేరు మీద ఒక స్టడీ బెంచ్ కోసం రూ.2 కోట్ల గ్రాంటు ఇచ్చాను అని ఆయన గుర్తు చేశారు. శ్రీదేవి గ్రూప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఆర్. హులినాయకర్, బుక్ అథారిటీ అధ్యక్షురాలు డాక్టర్ మనస, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ రుద్రన్న హర్తికోటె, మాజీ మంత్రి కె.ఎన్.రాజన్న, గ్రంథ సంపాదకుడు ప్రొఫెసర్ చిక్కన్న ఎణ్ణెకట్టె, తుమకూరు జిల్లా కసాప అధ్యక్షుడు కె.ఎస్.సిద్దలింగప్ప, అథారిటీ నిర్వాహకుడు కె.బి.కిరణ్ సింగ్, బీఎంటీసీ ఉపాధ్యక్షుడు నికేత్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
మైసూరులో
బీఐఎస్ అధికారుల దాడులు
మైసూరు: నగరంలోని ఒక బంగారు దుకాణం నుంచి, యూనిక్ ఐడెంటిఫికేషన్ (యూఐడీ) హాల్ మార్క్ లేని 430 గ్రాముల బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైసూరులోని లష్కర్ మొహల్లాలో ఉన్న ప్రతిభా జ్యువెల్స్పై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు దాడి చేసి తనిఖీ చేసినప్పుడు, ఆ దుకాణం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) యొక్క ప్రామాణిక గుర్తును దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 430 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బీఐఎస్ డైరెక్టర్ సుష్మా రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చర్య బీఐఎస్ చట్టం 2016 కింద రూపొందించిన ఆంక్షలు, నిబంధనల ఉల్లంఘన అని, ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలకు మళ్లీ ధరాఘాతం.!
● లీటర్ పాల ధరను రూ.10 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
శివాజీనగర: రాష్ట్రంలోని సామాన్య ప్రజలు ఇప్పుడు మరో ధరల పెంపు ముప్పును ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో లీటరు పాల ధరను రూ.10 మేర పెంచాలని పాల సంఘాలు ప్రభుత్వానికి అధికారికంగా విజ్ఞప్తి చేశాయి. ఈ ధరల పెంపుపై నిర్ణయాన్ని రాబోయే మూడు రోజుల్లోగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరాయి. రైతుల ద్వారా వచ్చిన తీవ్ర డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాల సంఘాలు స్పష్టం చేశాయి. పాల ఉత్పత్తి వ్యయం అధికారికంగా ఉండటంతో రైతులు లీటర్కు రూ.10 పెంచాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల రైతుల ప్రయోజనాల దృష్ట్యా పాల ధరను సవరించి, పెంచాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నామని బమూల్ డైరెక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. ఈ డిమాండ్ను తీవ్రంగా పరిగణించి, తదుపరి పోరాటానికి, వ్యూరచనకు కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం ఈనెల 22న బెంగళూరులోని ఫ్రీడం పార్కులో భారీ సభ నిర్వహించి, ప్రభుత్వానికి అధికారికంగా వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు. ఒకవైపు రైతుల ప్రయోజనాలు, మరోవైపు వినియోగదారుల జేబుకు చిల్లు పడుతుందనే భయం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


