బళ్లారి రూరల్: వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి? అని వేడి భోజన కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్ర సంయుక్త అక్షర దాసోహ కార్మిక సంఘం, ఏఐయుటీయుసీ ఆద్వర్యంలో శుక్రవారం జెడ్పీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రముఖుడు జి.సురేశ్ మాట్లాడుతూ.. లక్షలాది మంది కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని తెలిపారు. ఒంటరి మహిళలు, తల్లులు, కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో జీవనం కష్టంగా మారిందన్నారు. వేడి భోజన కార్మికుల వేతనాలు పెంచి ప్రధానోపాధ్యాయుల ఖాతాలో కాకుండా నేరుగా కార్మికుల ఖాతాలోనే వేతనాలు జమ చేయాలని కోరారు. ఏళ్ల తరబడి బాకీ ఉన్న కోడిగుడ్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలని సూచించారు. ప్రతిఘటనలో భాగంగా తాలూకా కార్యాలయం నుంచి జెడ్పీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రతిఘటనలో రాష్ట్రఅధ్యక్షలు ఎ.శాంత,కార్యదర్శి సంధ్యా పి.ఎస్.కార్మికులు పాల్గొన్నారు.


