బనశంకరి: పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఖైదీల్లో సత్ప్రవర్తన, పునర్వసతి కల్పించే ఉద్దేశంతో అత్యంత కీలక పథకం అమల్లోకి తీసుకువచ్చింది. జైలులో విచారణ ఖైదీలు స్వావలంబన కోసం ప్రారంభించిన నవసంకల్ప బేకరీని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అలోక్కుమార్ అధికారికంగా శుక్రవారం ప్రారంభించారు. బేకరీ ఉత్పత్తులను ప్రజలకు అందించే నవసంకల్ప బేకరీ ఆన్ వీల్స్ అనే ప్రత్యేక సంచార వాహనాన్ని కూడా ప్రారంభించారు. ఈ వినూత్న ప్రణాళికలో జైలుశిక్ష అనుభవిస్తున్న విచారణ ఖైదీలకు నాణ్యతతో తయారు చేయడం గురించి వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన ఖైదీలకు అధికారికంగా సర్టిఫికెట్లు అందజేశారు.
నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో విక్రయం
నవసంకల్ప బేకరీ ఆన్వీల్స్ ట్రాఫిక్ వాహనాల ద్వారా బెంగళూరు నగరంలో ప్రముఖ న్యాయస్థానాల ప్రాంగణాలు, ప్రజలు రద్దీ ఎక్కువగా ఉండే ప్రముఖ బస్స్టేషన్లలో విక్రయిస్తారు. ఈ ప్రాజెక్టు జైలు నుంచి విడుదలైన తరువాత ఖైదీలు నేరం నుంచి విముక్తులై సమాజవాహినిలో స్వావలంబన జీవితం సాగించడానికి దోహదపడుతుంది. దీంతో పాటు అవసరమైన ఉత్పత్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఆసరాగా ఉంటుంది. ఖైదీల పునర్వసతి చరిత్రలోనే నవసంకల్ప బేకరీ చాలా కీలకమైంది.


