రాయచూరు రూరల్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శాంతప్ప పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే డిసెంబర్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కార్యకర్తల సహకారంతో గ్రామ స్థాయి నుంచి నాయకులందరినీ ఏకం చేస్తామని తెలిపారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 20వ తేదీన జరగబోయే నూతన అధ్యక్ష పదవీ స్వీకార కార్యక్రమానికి జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు హాజరవుతారన్నారు. జిల్లా కాంగ్రెస్లో నెలకొన్న అసమ్మతి జ్వాలలను శాంతింపజేసి, అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.


