రాయచూరు రూరల్: గణపతి ఉత్సవాలను మతాలకు అతీతంగా జరుపుకోవాలని కిల్లే బ్రహన్మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు సూచించారు. శుక్రవారం నగరంలో కిల్లే మఠం వద్ద కేసరి గజానన యువక మండలి వారు ప్రతిష్టించిన గణపతికి పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపీణీ చేశారు.కార్యక్రమంలో నగర సభ మాజీ సభ్యులుడు దరూర్ బసవరాజ్, ప్రశాంతి, సత్యనారాయణ, సతీష్, కాశీ, దారాసింగ్, పురుషోత్తం ఇనాన్ని, గురుస్వామి, ఈరణ్ణ, నాగరాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
తరగతుల బహిష్కరణ
రాయచూరు రూరల్: లింగసూగూరు తాలూకా హట్టి పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించి, పాఠశాల పాలక మండలికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులకు గైర్హాజరయ్యారు. పాఠాలు బోధించే వారు లేకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. మేము వేలకు వేలు ఫీజులు, డొనేషన్లు చెల్లిస్తున్నప్పుడు ఉపాధ్యాయులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? అని విద్యార్థులు యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠాలు చెప్పే గురువులు లేకపోతే తమ భవిష్యత్తు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించి తరగతులకు వచ్చేలా చూడాలని కోరారు.
వాహనం ఢీకొని
కార్మికుడు మృతి
హోసూరు: హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై నడచి వెళ్తున్న కార్మికుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బీహార్ వాసి మృతి చెందాడు. వివరాలు.. బీహర్కు చెందిన విజయ్ కుమార్ (35). హోసూరులో నివాసముంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై ముత్తుమారెమ్మ ఆలయం వద్ద నడుచుకుని వెళ్తుండగా.. ఆ మార్గంలో వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయ్ కుమార్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఫ్కాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
నేడు గోకులాష్టమి
కోలారు: ముళబాగిలు నగరం విరూపాక్షి రోడ్డులో ఉన్న గోకుల నగర్లో శ్రీ నందగోకుల యాదవ సంఘం ఆధ్వర్యంలో 34వ గోకులాష్టమి కార్యక్రమాన్ని శనివారం ఉదయం 10.30 గంటగలకు ఏర్పాటు చేసినట్లు తాలూకా యాదవ సంఘం అధ్యక్షుడు నాగమంగల శంకరప్ప తెలిపారు. చిత్రదుర్గ మూలమఠం యాదవ సంస్థాన శ్రీ మాదవ నంద స్వామీజి సాన్నిధ్యంలో కార్యక్రమం జరుగుతుందని, ఎమ్మెల్య సమృద్ధి మంజునాథ్ పాల్గొంటారన్నారు. సముదాయ మహిళలకు వడిబాలు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.
పాత్రికేయులకు
త్వరలో ఇళ్ల స్థలాలు
కోలారు: జిల్లాలో పాత్రికేయులకు త్వరలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రవికుమార్ హామీ ఇచ్చారు,. శుక్రవారం నగరంలోని పాత్రికేయుల భవనంలో ఆరెంజ్ ఆర్మి ట్రస్టు ద్వారా 50 మందికి పైగా పాత్రికేయులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసి మాట్లాడారు. సమాజంలో రాజ్యాంగ నాలుగవ అంగం అయిన పత్రికా రంగం అందిస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు. రైతులకు కరువు పరిహారంగా బీమా కంపెనీ నుంచి త్వరలో రూ.29 కోట్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో పాత్రికేయుల సహకార సంఘం అధ్యక్షుడు గణేష్, కోశాధికారి రాజేంద్రసింహ, అబ్బణిశంకర్ పాల్గొన్నారు.


