హొసపేటె: రాయల రాజధాని హంపీలో శిల్పకళా చాతుర్యాన్ని వీక్షించాలని వచ్చిన తల్లీ కూతురు ప్రమాదవశాత్తు తుంగభద్ర నదిలో గల్లంతైన ఘటన శనివారం జరిగింది. విరుపాక్షేశ్వర స్వామి దేవాలయం వద్దనున్న నదిలో షాహీన్ (38), ఆమె కుమార్తె యాస్మిన్ (13) కొట్టుకుపోయారు.
ఎలా జరిగిందీ?
వివరాలు... ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా సూలెకెరె గ్రామానికి చెందిన షాహీన్, యాస్మిన్ బంధువులతో కలిసి విహారయాత్రకు హంపీకి వచ్చారు. ఉదయం వంట తర్వాత, వారు స్నానం చేయడానికి నది వద్దకు వెళ్లారు. యాస్మిన్ నదిలోకి జారి పడడంతో ఆమెను కాపాడాలని తల్లి కూడా వెళ్లింది. నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. బంధువులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. హంపీ పోలీసులు నదిలో గాలింపు చేపట్టారు. ఘటనాస్థలిలో ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండడంతో ఆటంకంగా మారింది. తల్లి మృతదేహం లభించగా, కూతురి కోసం వెతుకుతున్నారు. సంతోషంగా సాగాల్సిన విహారయాత్రలో విషాదం జరగడంతో బంధువులు విలపించారు.
తల్లి మృతదేహం లభ్యం
హంపీలో విషాద ఘటన
మృతులు కర్నూలు జిల్లావాసులు


