హొసపేటె: అధ్యక్షుడు, డైరెక్టర్ వేధింపులతో విసిగిపోయిన బహుళార్ధ సాధక వ్యవసాయ గ్రామీణ సంఘం కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని చిత్తవాడిగిలో చోటు చేసుకుంది. చిత్తవాడిగి బహుళార్ధ సాధక వ్యవసాయ గ్రామీణ సంఘం కార్యదర్శిగా పని చేస్తున్న జి.నింగప్ప(55) శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో విషం తాగారు. సంఘం సిబ్బంది వెంటనే అతడిని నగరంలోని ప్రభుత్వ సబ్ డివిజనల్ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ అతను మరణించాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. చిత్తవాడిగి సొసైటీ డైరెక్టర్ వడ్డిన శీనప్ప, అధ్యక్షుడు సతీష్ అతడిని వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారు అకౌంటింగ్ విషయాలపై తరచూ వాగ్వాదానికి దిగారని ఆరోపణ. శుక్రవారం కూడా వారు వాగ్వాదానికి దిగారు. దీంతో విసిగిపోయిన నింగప్ప విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ విషయమై చిత్తవాడిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో దోషులపై తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు, రైతు నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.


