హుబ్లీ: జిల్లాలో పోలీసులు పాలనను మరింత పరిణామాత్మకంగా నిర్వహించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీస్ ఉపవిభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఆదేశం మేరకు హుబ్లీ గ్రామీణ ఉపవిభాగం పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్గా శివానంద కటిగిని నియమించారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గుంజన్ ఆర్యను డీఎస్పీ శివానంద కటిగి కలిసి అధికార బాధ్యతలను చేపట్టారు. ఈ ఉపవిభాగంలోకి నవలగుంద, కుందగోళ, గుడగేరితో పాటు పలు పోలీస్ స్టేషన్లు ఉంటాయి. దీంతో పోలీస్ పాలన, శాంతిభద్రతల చట్టం కింద సజావుగా పర్యవేక్షణ సులభం కానుంది. రానున్న వినాయక చవితి, ఈద్ మిలాద్ పండుగల నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు చేపడుతున్నాం. సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ సిబ్బంది, రెండు కేఎస్ఆర్పీ బృందాలను నియమిస్తున్నామన్నారు.
ముందు జాగ్రత్త చర్యలు చేపతాం–ఎస్పీ
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. పండుగలకు డీజే వాడకంపై సుప్రీం కోర్టు, ప్రభుత్వ నియమాలను కట్టుదిట్టంగా పాటించాలి. నిర్వాహకులు సింగిల్ విండో వ్యవస్థ ద్వారా తగిన అనుమతులను తీసుకోవాలి. ఎక్కడైనా నియమాలను ఉల్లంఘించి అక్రమంగా డీజే వాడితే సహించబోమన్నారు. జిల్లాలో మట్కా, గంజాయి తదితర అక్రమ దందాలకు వ్యతిరేకంగా ప్రతి వారం ప్రత్యేక కార్యాచరణ చేపడతాం. అక్రమాలకు కళ్లెం వేయడానికి పోలీస్ శాఖ నిరంతరంగా చర్యలు చేపడుతోందన్నారు. గాలిలో తుపాకీ పేల్చిన ఆరోపణలపై గరగ పోలీస్ స్టేషన్లో బసవంతప్ప(70) పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానికులు శాంతి, సౌహార్థత, మతసామరస్యతతో మెలిగి పోలీసులతో సహకరించాలని ఎస్పీ గుంజన్ ఆర్య కోరారు.
ధార్వాడ జిల్లాకు అదనంగా డీఎస్పీని నియమించిన ప్రభుత్వం


