హుబ్లీ: పాత హుబ్లీ ఆసరా వీధిలోని భవాని శంకరనారాయణ ఆలయానికి చెందిన ప్రాచీన పుష్కరిణి(కోనేరు)పై హుబ్లీ ధార్వాడ నగర కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం చేపట్టిందని ఆరోపిస్తూ చెన్నపేట మెయిన్ రోడ్డు నుంచి పుష్కరిణి చలో ఆందోళన చేపట్టిన హిందూ సంఘాల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సదరు ఆలయ పుష్కరిణిపై నిర్మించిన రోడ్డును తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. పుష్కరిణి పరిరక్షణే ఆలయ అభివృద్ధి అంటూ నినాదాలు చేస్తూ పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ ఆందోళనకు విజయం లభించేదాకా ఈ పోరాటం ఆపేది లేదని ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అరవింద బెల్లద, మహేష్ టెంగినకాయి, ఎమ్మెల్సీ ప్రదీప్ శెట్టర్, శ్రీరామసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్, జయ తీర్థ కట్టి తదితరులు డిమాండ్ చేశారు. కాగా ఈ సందర్భంగా పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. సదరు ఆసరా వీధి నుంచి చుట్టు పక్కల 500 మీటర్ల పరిధిలో శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఈ గడువులో ప్రజలు గుంపులుగా చేరడం, నిషేధిత వస్తువులను తీసుకొని సంచరించడం, నినాదాలు చేయడం వంటిని నిషేధించారు. నియమాలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆందోళన చేపట్టిన హిందూ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.


