బనశంకరి: బెంగళూరులో తీవ్ర సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో నటి పవిత్రగౌడ మొదటి, ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప రెండవ నిందితులుకాగా, 14వ నిందితునిగా ఉన్న వారి మిత్రుడు ప్రదోశ్ ఎస్.రావ్ అప్రూవర్గా మారతానని ప్రకటించాడు. కేసు విచారణ గురువారం బెంగళూరు సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో జరిగింది. అప్రూవర్గా మారతానని పిటిషన్ దాఖలు చేశాడు. నటుడు దర్శన్ సీనియర్ న్యాయవాది హస్మత్ పాషా వాదిస్తూ.. కేసులో అవసరం కంటే అధికంగా సాక్ష్యాధారాలు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని దర్యాప్తు బృందం హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు తెలిపిందన్నారు. ప్రదోశ్ పిటిషన్ కాపీని తమకు అందజేయాలని, న్యాయపరమైన అభ్యంతరం తెలియజేస్తామని హస్మత్ పాషా ధర్మాసనాన్ని కోరారు. అతడు అప్రూవర్గా మారడాన్ని ఆయన దాదాపు వ్యతిరేకించారు.
అడ్డుకోలేరు: ప్రభుత్వ వకీలు
ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్ వాదిస్తూ అప్రూవర్ ప్రక్రియ చట్టబద్ధంగా జరుగుతుంది, నిందితుని సాక్ష్యాన్ని అడ్డుకునే హక్కు ఇతరులకు లేదని అన్నారు. అప్రూవర్ కావడానికి ప్రాసిక్యూషన్, కోర్టు అనుమతి కావాలి కానీ ఇతర నిందితుల సమ్మతితో పని లేదన్నారు.
హత్య జరిగిన షెడ్డులో చోటుచేసుకున్న దృశ్యాలను ప్రస్తావించిన ప్రాసిక్యూటర్.. రేణుకాస్వామిపై దర్శన్ దారుణంగా దాడి చేశాడన్నారు. ప్రదోశ్ వద్దు సార్ అని దర్శన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. ఈ కేసులో ప్రదోశ్ పాత్ర ప్రధానమైనదని వివరించారు. అయితే అప్రూవర్గా మారడానికి కొన్ని ముఖ్య షరతులను విధించారు. ఈ కేసులో తెలిసిస ప్రతి విషయాన్ని కోర్టు ముందుంచాలి, తనతో పాటు నటుడు దర్శన్, మిగిలిన నిందితుల భాగస్వామ్యం, కుట్ర వివరాలను స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు. వాదనలను ఆలకించిన జడ్జి.. దర్శన్ న్యాయవాదికి ప్రదోశ్ పిటిషన్ కాపీని అందజేయాలని ఆదేశించి విచారణను వాయిదా వేశారు.
రేణుకాస్వామి హత్య కేసు...
అప్రూవర్గా మారతానని నిందితుడు ప్రదోశ్ పిటిషన్
వ్యతిరేకించిన దర్శన్ న్యాయవాది
కోర్టులో వాడివేడిగా వాదనలు


