● పారిశ్రామికవేత్తలకు
సీఎం డీకే శివకుమార్ పిలుపు
శివాజీనగర: రాష్ట్ర తదుపరి దశ అభివృద్ధిని తీర్చిదిద్దడంలో కర్ణాటక ప్రభుత్వానికి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరు టెక్ సమ్మిట్లో భాగంగా శుక్రవారం ఒక ప్రైవేట్ హోటల్లో వివిధ సంస్థల సీఈఓలతో జరిగిన భోజన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ ఎకోసిస్టమ్ బలోపేతానికి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రణాళికను ప్రకటించారు. కర్ణాటక సాఫ్ట్వేర్ ఎగుమతుల విలువ రూ.4.36 లక్షల కోట్ల మార్కును దాటిందన్నారు. ఈ ఏడాది ఇది రూ.5.5 లక్షల కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్, వినియోగ మార్కెట్లో బెంగళూరు అగ్రస్థానాన్ని నిలుపుకుందని అన్నారు. బెంగళూరులోని ప్రతిభ, పర్యావరణ వ్యవస్థ, మానవ వనరుల కారణంగా ఇతర చోట్ల 3.50 డాలర్లు ఖర్చు అయ్యే పనిని ఇక్కడ కేవలం 1 డాలర్కే చేయవచ్చని కంపెనీలు పేర్కొంటున్నాయన్నారు. తరగతి గదులు, ఉపాధ్యాయ శిక్షణ, అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల కింద ఒక్కో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
గ్రాడ్యుయేట్ విద్యార్థిని
అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం: గదగ్లోని ఎంజీఆర్డీపీఆర్ యూనివర్సిటీలోని హాస్టల్లో గ్రాడ్యుయేట్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. బాగలకోట జిల్లా గద్దనకేరికి చెందిన వీణ(25) మృతురాలు. ఈమె యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్స్ చదువుతోంది. హాస్టల్లోని గదిలో వీణ మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో లభించింది. వీణ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. కాళ్లు నేలకు తాకి ఉన్నాయని, ఉరి వేసుకున్న దుస్తులు తమ కుమార్తెవి కాదని, ముఖం మీద గాయాలు ఉన్నాయని, అందువల్ల ఇది ఆత్మహత్య కాదని, ఎవరో హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గదగ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


