మైసూరు: ఆషాఢ మాసంలో రెండో శుక్రవారం, శక్తి స్వరూపిణి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కోసం మైసూరు నగరంలోని చాముండి కొండకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కొండపై వెలసిన చాముండేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. లేత గులాబీ రంగు పట్టు చీరలో ఆమెను చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయం లోపల, బయట వివిధ రకాల పూలు, పండ్లతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని తోతాపురి మామిడి పండ్లు, డ్రాగన్ప్రూట్, ఇతర పండ్లు, రంగురంగుల పూలతో ప్రత్యేకంగా సింగారించారు. చాముండేశ్వరి అమ్మవారి అసలు విగ్రహం, ఉత్సవ విగ్రహం గులాబీ రంగు చీరలో లక్ష్మీదేవి అలంకరణ చేసినట్లు ఆలయ ప్రధాన పురోహితుడు శశిశేఖర్ దీక్షిత్ తెలిపారు.
ప్రముఖుల దర్శనం
చాముండి కొండను సందర్శించిన అసంఖ్యాక భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు అశోక్ పట్టన్, ఏ.ఆర్.కృష్ణమూర్తి, నరేంద్రస్వామి, రవి గణిగ, డీ.రవిశంకర్, నటుడు ధన్వీర్, నటి సప్తమి గౌడ, బిగ్ బాస్ ఫేమ్ అశ్వినిగౌడ తదితరులు దర్శనం చేసుకున్నారు.
శక్తిదేవత దర్శనానికి తరలి వచ్చిన భక్తులు
భక్తులతో కిటకిటలాడిన చాముండి కొండ


