రాయచూరు రూరల్: ఓటరు జాబితా సవరణ(సర్)కు చేపట్టిన చర్యలపై జిల్లా విద్యాశాఖ ఉప సమన్వయాధికారి సుఖదేవ్ సమీక్షించారు. బుధవారం నగరంలోని రైల్వే స్టేషన్ వసతి నివాసాల్లో బీఎల్ఓలు, ఇతర కార్యకర్తలతో కలిసి పర్యటించి ఓటర్లతో చర్చించి జాగృతి కల్గించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో ఉన్న వారి పేర్ల సమీక్షను త్వరిత గతిన పూర్తి చేయాలని, లేకుంటే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
వరుణ కృప కోసం పాదయాత్ర
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు దాటినా రైతులు పొలాల్లో వేసుకున్న పైర్లు వర్షాలు కురవక వాడుముఖం పడుతున్న నేపథ్యంలో రైతులు దేవుళ్లకు మొర పెట్టుకుంటున్నారు. సింధనూరు తాలూకాలో వర్షాల కోసం మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ నగరంలోని కోటె ఈరణ్ణ దేవాలయం నుంచి అంబా మఠం వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్, మల్లికార్జున, మౌనేష్, శరణప్ప గౌడ, సూగూరయ్య స్వామి తదితరులతో పాటు రైతులు పాల్గొన్నారు.
రోడ్డు పనుల్లో నాణ్యతపై విచారణ జరపండి
రాయచూరు రూరల్: మాన్వి–రాయచూరు మధ్య రాష్ట్ర రహదారి పనులను నాసిరకంగా చేపట్టారని, దీనిపై విచారణ జరపాలని అంబేడ్కర్ సేన ఆందోళనకారుడు ప్రభురాజ్ కొడ్లి డిమాండ్ చేశారు. బెంగళూరు కేఆర్డీసీఎల్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రధాన రహదారుల నిర్మాణం విషయంలో లోపాలను సవరించకుండా అశాసీ్త్రయంగా నిర్మించడం తగదన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. రోడ్డును పెద్దదిగా చేసి మురుగు కాలువలను చిన్నవిగా చేసి వర్షాకాలంలో నీరు ప్రవహించకుండా నిర్మాణాలు చేపట్టడంపై విచారణ జరిపి నాణ్యతగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఇద్దరు బైక్ చోరుల అరెస్ట్
● 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఇందిరా నగర్ ఆకాష్(20), మాన్వి ఇమ్రాన్(26)లను అరెస్ట్ చేశామన్నారు. సుమారు రూ.17.30 లక్షలు విలువ చేసే 18 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ఎస్ఐలు మంజునాథ్, శారద తదితరులున్నారు.
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
బళ్లారిఅర్బన్: ఎస్ఎల్ఎన్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, శ్రీధరగడ్డ గోల్డ్ షాప్ యజమాని షణ్ముఖ తన 43వ జన్మదినాన్ని పురస్కరించుకుని తాలూకాలోని కప్పగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. ముందుగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుక జరుపుకున్నారు. ప్రముఖులు ఎర్రగుడి మల్లయ్య, రక్షణ వేదిక రఘు, ఉప్పార్ హనుమేష్, సీనా రాజు, సత్య హీరో హాల్ కృష్ణ, కప్పగల్ గ్రామ ప్రముఖులు రమణ, మధు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


