రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో ముందుగా కురిసిన వానలకు రైతులు విత్తిన పంటలు ఎదుగుదల లేక వాడుముఖం పట్టడంతో వాటిల్లిన పంటలకు నష్ట పరిహారం అందించాలని రాష్ట్ర యువ జేడీఎస్ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విజయపుర జిల్లా ఇండిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కరువు పీడిత ప్రాంతాలను గుర్తించడంలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఏ ఒక్క మంత్రి కూడా కరువు పీడిత ప్రాంతాలకు వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రైతులు భూముల్లో వేసుకున్న పంటలు వానలు కురువక వాడుముఖం పట్టాయన్నారు. పంట నష్టపరిహారం అందించాలన్నారు. శనగ, పెసలు, జొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, కంది వంటి పంటలు ఎండిపోతున్న విషయాన్ని సర్కార్కు వివరిస్తామన్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో మాజీ మంత్రి బండెప్ప, శాసన సభ్యుడు శరణేగౌడ, సురేష్ బాబు, కృష్ణారెడ్డి, దొడ్డనగౌడ, హన్మంతప్ప, చంద్ర శేఖర్లున్నారు. రాయచూరులో సీపీఐ(ఎంఎల్) సభ్యులు ఎండిన భూములను పరిశీలించారు.


