బళ్లారి రూరల్ : బళ్లారి నగరంలో కేన్సర్ రోగుల కోసం త్వరలో ఆసుపత్రి ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ ఒమేగా ఆసుపత్రి కేన్సర్ వైద్యుడు డాక్టర్ ఎస్.ఎస్.నిరాణి తెలిపారు. సోమవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బళ్లారిలో ప్రైవేటు కేన్సర్ ఆసుపత్రి లేనందున బెంగళూరు, హుబ్లీ, కర్నూలు, హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బళ్లారిలో ఒమేగా ఆసుపత్రి సౌజన్యంతో మరో ఆరు మాసాల వ్యవధిలో కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. చికిత్సలో భాగంగా నోరు, గర్భసంచి, స్తన తదితర అనేక కేన్సర్ వ్యాధులకు వైద్యం, శస్త్రచికిత్సలు అందిస్తారన్నారు. కేన్సర్ను గుర్తించడానికి బయాప్సీ, మెమో తదితర పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కేన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారతి తదితర ప్రయోజనాలు వర్తింపచేయనున్నట్లు తెలిపారు.


