హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా మరబ్బిహాల్ గ్రామ పంచాయతీ పరిధిలో వరదాపూర్, నారాయణ దేవరకెరె మధ్య ఉన్న జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి విషపూరిత నీలం రంగు వ్యర్థాలు రైతుల ఆరోగ్యం, పశువులపై ప్రభావం చూపుతున్నాయి. పంటలు కూడా దెబ్బతింటున్నాయని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు జే.ఎం.వీరంసంగయ్య తెలిపారు. ఫ్యాక్టరీపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారికి వినతిపత్రం సమర్పించారు. వరదాపూర్, నారాయణ దేవరకెరె, కెంచటనహళ్లి, కెంచటనహళ్లి తాండా, మరబ్బిహాల్, మరబ్బిహాల్ తండాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. కర్మాగారం నుంచి వెలువడే దుమ్ము, విషపూరిత నీలం వ్యర్థాలతో ప్రజలు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. భారీగా శబ్ధాలతో పిల్లలు చదువుకోలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.గోనిబసప్ప, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తంబ్రల్లి తదితరులు పాల్గొన్నారు.


