రాయచూరు రూరల్ : కర్ణాటక చరిత్రలో అతివృష్టి, అనావృష్టితో పలు జిల్లాల్లో రైతులు సాగు చేసిన పంటలు సక్రమంగా పండక, పశుగ్రాసం లేక పశువులు తల్లడిల్లుతున్నా పంట నష్టపరిహారం అందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూగనోము పాటిస్తున్నాయి. బాధిత రైతులు ఎలా జీవించాలో తెలియని సందర్భంలో ఎక్కువ పరిహారం వస్తుందన్న ఆశతో అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకేమీ పట్టనట్లు ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించే తహసీల్దార్లే లేకపోవడంపై బాధితుల్లో విచారం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో తాము అన్నమో రామచంద్రా అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబట్టారు. ఆరు తాలూకాల్లో తీవ్ర కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి.
పశుగ్రాసానికీ కటకటే..
వర్షాలు లేక పంటలు పండక పోవడంతో పశువులకు పశు గ్రాసం కూడా లభించని దుిస్థితి నెలకొంది. చెరువులు, కుంటలు, బావులు, వాగుల్లో నీరు లేక పోవడంతో పాటు పశువులను మేపడానికి పశుగ్రాసం లభించక రైతులు కబేళాలకు విక్రయించడం, జాతరలు, సంతల్లో తక్కువ ధరకు విక్రయించడం జరుగుతోంది. జిల్లాలో 1.55 లక్షలకు పైగా పశువులను ఇప్పటికే విక్రయించినట్లు సమాచారం. జిల్లాకు 25 వేల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరముందని పశు సంవర్ధక శాఖాధికారులు జిల్లాధికారికి మూడు నెలల క్రితం ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. తుంగభద్ర ఎడమ కాలువ కింద వరి పంటను తక్కువ ప్రమాణంలో పండించడంతో పశుగ్రాసం కొరత ఏర్పడిందని సమాచారం.
జాతరలో జోరుగా పశువుల విక్రయాలు
సంతలో బారులు తీరిన పశువులు
జిల్లాలో ఆరు తాలూకాల్లో దుర్భిక్షం
కబేళాలకు తరలుతున్న మూగజీవాలు
సంతల్లో తక్కువ ధరకు పశువుల విక్రయాలు


