హుబ్లీ: రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వ కొలువుల కోసం ధార్వాడలో భారీగా నిరుద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిథి ఉపన్యాసకులు కూడా ఆందోళన బాట పట్టారు. తమ వివిధ సమస్యల పరిష్కారం కోసం సదరు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ఆ సంఘం నేతలు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. గత 20 ఏళ్ల నుంచి అతిథి అధ్యాపకులుగా పని చేస్తున్నాం. ఈ ఏడాది యూజీసీ నియమాల సాకు చూపి 6 వేలకు పైగా అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. దీంతో గత మూడు నెలల నుంచి పనులు లేక ఖాళీగా కూర్చున్నారు. సిద్దరామయ్య శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో తమకు న్యాయం జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని సదరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హనుమంత గౌడ మీడియాకు తెలిపారు. సానుకూల నిర్ణయాలు తీసుకోక పోతే తుమకూరు నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేపట్టి బెంగళూరు ఫ్రీడం పార్కులో నిరవధిక దీక్ష చేపడతామన్నారు. గత ఏడాది కళాశాలలను బహిష్కరించి పోరాటం చేశామని, ఈసారి కూడా అదే బాటలో సాగుతామన్నారు. తమకు యూజీసీ వేతనాలు వద్దు. రాష్ట్ర వేతనాలు చాలు. గత 20, 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమను విధుల నుంచి తొలగించకుండా 60 ఏళ్ల వయసు దాకా సేవా భద్రత కల్పించాలన్నారు. ఆ మేరకు ప్రభుత్వం నియమాలను రూపొందించాలన్నారు.


