సాక్షి,బళ్లారి: బాలికతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో పోక్సో కేసు నమోదైన అనంతరం కనిపించకుండా పోయిన స్వయం ప్రకటిత స్వామీజీ మల్లికార్జున ముత్యా పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. యాదగిరి జిల్లా మహాల్రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యాపై బాలికతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. దీంతో గతనెల 25 నుంచి ముత్యా కనిపించకుండా పోయారు. మరో వైపు స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలించారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, బాలిక కుటుంబ సభ్యులు కూడా తనపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని, కుట్రతో చేశారని, తాను త్వరలో కనిపిస్తానని ఆయన వీడియో పంపారు. వారం రోజుల నుంచి ముత్యా కనిపించకుండా పోవడంతో ఎట్టకేలకు బుధవారం రాత్రి యాదగిరి జిల్లా శహాపుర సర్కిల్ ఇన్స్పెక్టర్ ముందు హాజరయ్యారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేసిన అనంతరం పంపించేశారు. తిరిగి గురువారం మధ్యాహ్నం కూడా విచారణకు రమ్మడంతో ముత్యా పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ చేసిన అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. కాగా శహాపుర పోలీసు స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరింపజేశారు. కేసు నమోదు చేసుకుని వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంపై చర్చ నడుస్తోంది. పోలీసు స్టేషన్ వద్ద హైడ్రామా సాగుతోంది. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయగా, కేసు విచారణ ఈనెల 6వ తేదీకి వాయిదా పడింది.


