హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని తంబ్రహళ్లిలోని బండె రంగనాథ స్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది ప్రజల సమక్షంలో వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా వంశపారంపర్య భక్తులు, పూజారుల కుటుంబం కొండలో నివసించే రంగనాథ స్వామి, లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. ఉదయం స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ మహేశ్వర స్వామీజీ నాయకత్వంలో అన్ని రకాల అలంకరణలతో ఉత్సవమూర్తిని కొండపై నుంచి వీధిలోకి తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం రథాన్ని లాగారు. వేలంలో స్వామి వారి జెండాను కొప్పళకు చెందిన రంగప్ప పూజారి రూ.3,01,101కు పాడారు. రథాన్ని వివిధ పూలమాలలతో అలంకరించారు. అరటి ఆకులు, రంగురంగుల దుస్తులతో అలంకరించిన రథంలో ఉత్సవ మూర్తిని ప్రతిష్టించారు. లక్ష్మీ రమణ గోవిందా..గోవింద..అంటూ అక్కడ గుమిగూడిన భక్తుల ఆనందోత్సాహాల మధ్య రథోత్సవం సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథంపైకి అరటిపండ్లు విసిరి తమ భక్తిని చాటారు. రథోత్సవం నేపథ్యంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసు సిబ్బంది తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రథోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు


