
బొలెరో– కారు ఢీ, చిన్నారి మృతి
కొలిమిగుండ్ల: ఉమ్మడి కర్నూలు జిల్లా రాఘవరాజుపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం కారు, బొలేరో జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన చంద్రమోహన్రెడ్డి తన కూతురు జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తుండేవాడు. చంద్రమోహన్రెడ్డి అమ్మవారికి మొక్కుబడి చేసే కార్యక్రమం ఉండటంతో చిన్నారి జోష్యహర్షిణిరెడ్డి తాతయ్య రిటైర్డ్ టీచర్ రామసుబ్బారెడ్డితో పాటు బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవిలను కారులో నంద్యాల నుంచి తీసుకొని బయలు దేరారు. సోమవారం పరీక్ష ఉందని తాను రానని చిన్నారి మారాం చేసింది. అయితే వెంటనే వచ్చేద్దామని బుజ్జగించి తీసుకెళ్లారు. రాఘవరాజుపల్లె శివార్లలోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లె నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలేరో వాహనం కారును వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులో ఉన్నవారంతా అందులో ఇరుక్కు పోవడంతో స్థానికులు అతికష్టంగా బయటకు తీశారు. బొలేరోలో ఉన్న అంకిరెడ్డిపల్లె యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. చిన్నారి జోష్య హర్షిణి కోమాలోకి వెళ్లిపోవడంతో చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులను 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరో ఇద్దరికి గాయాలు

బొలెరో– కారు ఢీ, చిన్నారి మృతి