భార్యను హత్య చేసి హైడ్రామా
యశవంతపుర: భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి ఏమీ ఎరుగనట్లు ఆస్పత్రికి తీసుకువచ్చారు. తన భార్య అచేతనంగా పడిపోయిందని రోదించాడు. దీంతో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. ఈ ఘటన యశ్వంతపురలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. నిందితుడు శరత్ను విచారణ చేయగా అసలు కథ బయటపడింది.
వివరాలు... శరత్కు మొదటి భార్య ఉండగా రెండో భార్యగా ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ప్రియను వదలించుకోవాలని తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రిందట ప్రియతో గొడవపడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లు ఆస్పత్రికి తీసుకువచ్చి రోదించాడు. అతని హైడ్రామాపై అనుమానించిన పోలీసులు పరిశీలించగా హత్య చేసినట్లు తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.