బళ్లారి టౌన్: విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ రాణించాలని మేయర్ పి.గాదెప్ప సూచించారు. గురువారం బీపీఎస్సీ కళాశాలలో కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యువ సౌరభ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాదెప్ప మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కలలను విద్యార్థులు సాకారం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు కీర్తి తేవాలని పేర్కొన్నారు. కన్నడ సాంస్కృతిక శాఖ ఏడీ నాగరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రాంతీయ కళలు, సంస్కృతి జానపద కళలు నాటకాలను కాపాడుకునేందుకు ఇలాంటి జాగృతి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు జేవీ మహిపాల్, సీనియర్ పాత్రికేయుడు ఐరాజు, దొడ్డబసప్ప గవాయి, జానపద గాయకుడు హులుగప్ప, రిటైర్డ్ పీఎస్ఐ హుస్సేని తదితరులు పాల్గొన్నారు.


