రాయచూరు రూరల్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా ఆల్మట్టి డ్యాం నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ముందు జాగ్రత్తగా అధికారులు దిగువకు నీటి విడుదలను మరింత పెంచారు. డ్యాం గరిష్ట మట్టం 519.60 మీటర్లు కాగా.. ప్రస్తుతానికి నీరు 518.78 మీటర్ల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా.. ఇప్పటికే నిల్వ 100 టీఎంసీల మార్కును దాటి నిండు కుండలా మారింది. మహారాష్ట్ర క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల వల్ల దాదాపు 65,000 నుంచి 70,000 క్యూసెక్కుల వరద నిరంతరాయంగా వచ్చి చేరుతోంది. డ్యామ్ సురక్షిత నియంత్రణలో భాగంగా అధికారులు సుమారు 70,000 క్యూసెక్కుల వరకు నీటిని కృష్ణా నది దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ వైపు వదులుతున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రవాహం పెరగడంతో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోట, విజయపుర జిల్లాలు, కళ్యాణ కర్ణాటకలోని కలబురగి, యాదగిరి, రాయచూరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. నది ఒడ్డున ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు నదీ తీర ప్రాంతాల వైపు వెళ్లకుండా అధికారులు గ్రామాల్లో దండోరా వేయించి హెచ్చరిస్తున్నారు.
అగళి: మండలంలోని అగళి, ఇరిగేపల్లి వద్ద సువర్ణముఖి నదిపై వంతెన కూలిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అగళి నుంచి ఇరిగేపల్లి, నందరాజునపల్లి తదితర గ్రామలకు వైపునకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో భారీ సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కూలిపోయింది. దీంతో వంతెనపై వాహనాల రాకపోకలకు నిషేధించారు. వాహనాల రాకపోకలకు వీలుగా పక్కనే డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే వర్షాకాలంలో ఆ రోడ్డులో బురద ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.
27ఎండీకెఎస్203: ధ్వంసమైన ఇరిగేపల్లి వంతెన


