కుంభకోణంపై దర్యాప్తునకు వినతి
శ్రీనివాసపురం: నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్ల కుంభకోణాన్ని సీబీఐతో విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని, సంబంధిత ఆర్టీఓ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రైతు సంఘం పదాధికారులు శుక్రవారం తహసీల్దార్ ద్వారా రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ ఎవరిదో భూమికి వేరెవరో ట్రాక్టర్ యజమాని నకిలీ బోనఫైడ్ దాఖలాలు సృష్టించి ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర లభించాల్సిన పన్నులను అధికారులు వంచించారని ఆరోపించారు. అక్రమ ఆర్డీ నెంబర్లను సృష్టించడం ద్వారా వేల ట్రాక్టర్లు, ట్రాలీలను రిజిస్టర్ చేశారన్నారు. ప్రతి నకిలీ బోనఫైడ్ దాఖలాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అధికారులు లంచం తీసుకున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఒత్తిడి చేశారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫారూక్ఫాషా, జిల్లా కార్యాధ్యక్షుడు హెబ్బణి ఆనందరెడ్డి, బంగారి మంజు తదితరులు పాల్గొన్నారు.