ప్రభుత్వ దాఖలాల్లోకి రెవిన్యూ గ్రామాలు
శ్రీనివాసపురం: కొత్త రెవిన్యూ గ్రామాల పేర్లను మార్చి ప్రభుత్వ దాఖలాల్లోకి చేర్చుతున్నట్లు ఎమ్మెల్యే కెఆర్ రమేష్కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని తాలూకా కార్యాలయం ముందు ఏర్పా టు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు హక్కుపత్రాలను అందించి మాట్లాడారు. పూర్వం భూమి రాజ మహారాజుల ఆధీనంలో ఉండేది. అనంతరం జమీందారుల చేతుల్లోకి వచ్చిందన్నారు. పూర్వం కొంత మందిని గ్రామం నుంచి బయట ఉంచేవారు. ఇలాంటి జనవసతి ప్రదేశాలకు పేర్లు ఉండేవి కాదు. ఇలాంటి గ్రామాలను గుర్తించి కొత్త పేర్లు పెట్టి ప్రభుత్వ దాఖలాల్లో చేర్చిన తరువాత హక్కుపత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ శిరీన్తాజ్, పీఎల్డీ బ్యాంకు అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
నూతన భవనం ప్రారంభం
బాగేపల్లి: నియోజకవర్గంలో ఉన్న చేలూరును ప్రత్యేక తాలూకాగా ప్రకటించింది కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఎస్.ఎన్. సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చేలూరులో నూతన తాలూకా ఆఫీసు భవనాన్ని ప్రారంభించారు. బాగేపల్లికి, చింతామణికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో అనుకూలం కోసం చేలూరులో తాలూకా కోసం ప్రజలు పోరాటం చేశారని చెప్పారు.
నేత్రపర్వంగా బ్రహ్మరథోత్సవం
మాలూరు : లక్కూరులో కోదండరామస్వామి బ్రహ్మరథోత్సవ వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి అభిషేకం, హోమం, హవనం, వేదమంత్ర పారాయణం తదితర ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఉత్సవ మూర్తిని అలంకరించిన రథంలో ప్రతిష్టించి గ్రామంలోని ప్రముఖ వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.