చిగురుమామిడి/సైదాపూర్: రైతులకు ఇబ్బంది కలగకుండా భూముల రీసర్వే చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం చిగురుమామిడి మండలం ఉల్లంపల్లిలో ఆర్డీవో షర్మిలతో కలిసి సర్వే వివరాలు తెలుసుకున్నారు. రైతులకు తప్పనిసరిగా సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, హద్దుల వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో రెండు బృందాలుగా రీసర్వే చేస్తున్నామని తహశీల్దార్ కనకయ్య కలెక్టర్కు వివరించారు. అనంతరం ఆయిల్పాం నర్సరీ ఏర్పాటుకు ఓదెల మల్లన్న గుట్టవద్ద స్థలాన్ని, గునుకులపల్లి నుంచి లంబాడిపల్లి ద్వారా చిగురుమామిడి మండల కేంద్రానికి నిర్మించే రోడ్డును పరిశీలించారు. సర్పంచ్లు అలువాల శంకర్, గునుకుల మధుసూదన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వభూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్లో ఎస్సారెస్పీ భూములను పరిశీలించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, వినియోగం వివరాలను తహసీల్దార్ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబందించి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు.


