● మధురానగర్ చౌరస్తాలో ఆందోళన ● పోలీసుల లాఠీచార్జ్.. తోపులాటలో విరిగిన మహిళ కాలు
గంగాధర: తమ ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించాలని నారాయణపూర్వాసులు రోడ్డెక్కారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో శనివారం ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సీపీఎం నాయకులు జాన్వెస్లీ, మిల్కూరి వాసుదేవరెడ్డి, ఏఐఎఫ్బీ నాయకుడు అంబటి జోజిరెడ్డి మద్ధతుగా నిలిచారు. నారాయణపూర్ను పూర్తిస్థాయి ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వాయర్లో నీరు నిల్వచేస్తే కట్టకింద ఉన్న ఊరు మొత్తానికి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు గ్రామస్తులతో పాటు నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయగా.. తోపులాట జరిగింది. ఈ ఘటనలో నారాయణపూర్ గ్రామానికి చెందిన సహీనా కాలు విరిగింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకారులు చౌరస్తాలోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించగా.. అరెస్టు చేసి రామడుగు పోలీస్స్టేషన్కు తరలించారు.


