వీర్నపల్లి: వీర్నపల్లి మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మద్దిమల్లతండాకు చెందిన కడావత్ పీరు, మద్దిమల్ల గ్రామానికి చెందిన వీరవేణి వెంకటయ్య తమ ద్విచక్ర వాహనాలపై వేర్వేరుగా వెళ్తున్నారు. వెంకటయ్య విద్యుత్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తుండగా.. విధి నిర్వహణలో భాగంగా గర్జనపల్లి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సబ్ స్టేషన్ ప్రాంతంలో 2 వాహనాలు అదుపు తప్పి ఎదురెదురుగా బలంగా ఢీకొట్టుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన 108 సిబ్బంది.. క్షతగాత్రులను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అనుమానం పెనుభూతమై..
● బీపీఎం రిషికను వేధించిన అత్తింటివారు
● గడ్డి మందు తాగిన వైనం
● చికిత్స పొందుతూ మృతి
● ఐదుగురిపై కేసు
ఓదెల: అత్తింటివారి వేధింపులు తాళలేక రిషిక(24) గడ్డి మందు తాగగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. పొత్కపల్లి ఎస్సై సనత్కుమార్రెడ్డి, మృతురాలి తండ్రి చొప్పరి భూమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన రిషికతో ఓదెల మండలం పిట్టలఎల్లయ్యపల్లెకు చెందిన పిట్టల నవీన్కు సంవత్సరంన్నర క్రితం వివాహమైంది. రిషిక ఓదెల మండలం గుండ్లపల్లెలో బ్రాంచ్ పోస్టు మాస్టర్గా పని చేస్తోంది. పిట్టలఎల్లయ్యపల్లెలో భర్త పిట్టల నవీన్, అత్త, మామ పిట్టల విజయ, కొంరయ్య, ఆడపడుచు, ఆమె భర్త పెండం రమ్య, పెండం శ్రీకాంత్ ప్రతిరోజు అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించేవారు. మానసిక క్షోభకు గురైన రిషిక తనలో తాను బాధపడుతూ ఈనెల 3న మధ్యాహ్నం గడ్డి మందు తాగింది. హైదరాబాద్ నిమ్స్కు తరలించగా.. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందింది. రిషిక మృతికి కారకులైన భర్త పిట్టల నవీన్, అత్త పిట్టల విజయ, మామ పెద్దపల్లి మార్కెట్ డైరెక్టర్ పిట్టల కొంరయ్య, ఆడపడుచు పెండం రమ్య, ఆడపడుచు భర్త పెండం శ్రీకాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


