చొప్పదండి: ఇంట్లో పండుగ చేసుకుందామని బంధువులను పిలిచిన వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రుక్మాపూర్లో జరిగింది. ఎస్ఐ నరేశ్రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కట్ట రాజేశం(40) ఈ నెల 9న తన ఇంట్లో మైసమ్మ పండుగ నిర్వహించేందుకు వివిధ గ్రామాల్లోని బంధువులను పిలిపించాడు. అదేరోజు రాత్రి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన కోసం శుక్రవారం ఉదయం బంధువులు వెతకగా గ్రామ శివారులోని నర్సరీలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది కనిపించాడు. మృతుడికి ఒక కుమార్తె, నవోదయ విద్యాలయంలో చదువుతున్న ఒక కుమారుడు ఉన్నారు. మూడేళ్లుగా మద్యానికి బానిసై, సరిగ్గా పనికి వెళ్లడం లేదని ఆత్మహత్యపై అనుమానం లేదని మృతుడి భార్య కట్ట రజిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.


