గాడ్సే వారసులు.. గాంధీ వారసులనంటారా?
కరీంనగర్కార్పొరేషన్: గాడ్సే వారసులే.. గాంధీ వారసులను గాడ్సే వారసులంటున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఉగాది సందర్భంగా గురువారం కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ 30 ఏళ్లు స్వాతంత్య్రం కోసం పోరాడితే ఆంగ్లేయిలు ఒక్క దెబ్బ కొట్టలేదని, స్వాతంత్య్రం వచ్చాకే గాడ్సే తుపాకీతో కాల్చిచంపాడని, అదే గాడ్సే వారసులు గాంధీ స్మృతి వనం పెడుతామంటే విమర్శిస్తూ, ఆటంకాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందేనని, శాసనసభలో జరిగిన అంశం కాబట్టి బండి సంజయ్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. 12 ఏళ్లుగా మోదీ మాటల గారడి తప్ప, దేశానికి నిర్మాణాత్మకంగా చేసిందేమీ లేదన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును మోదీ అపహాస్యం చేశారని, బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదన్నారు. మూసీ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే సుందరీకరణ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. సబర్మతి నిర్మిస్తే లేని తప్పు మూసీని సుందరీకరిస్తే ఎందుకు వచ్చిందన్నారు. ఎవరు పార్టీని వీడిపోవాలని అనుకోరని, జీవన్రెడ్డిపై పార్టీ మాట్లాడుతుందన్నారు. సీఎం సీనియర్లను తొక్కుకుంటూ వచ్చారని సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఒక్కొక్కరి భాష ఒక్కోరకంగా ఉంటుందన్నారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉండి సీఎం అయ్యారన్నారు. బీజేపీలో ఎంతమంది సీనియర్లను సంజయ్ తొక్కుకొంటూ వచ్చారో చెప్పాలని, చాలామందికి రాని అవకాశం ఆయనకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొడూరి సత్యనారాయణగౌడ్, ఆరెపల్లి మోహన్, నాయకులు వుట్కూరి నరేందర్రెడ్డి, రాచకొండ చక్రధర్రావు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


