సకాలంలో రుణాలివ్వండి
కరీంనగర్ అర్బన్: రైతుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆదేశించారు. 2026–27కు గాను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారుపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేడీసీసీబీ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను బ్యాంకర్లు నిర్ణయించాలని సూచించారు. పంటల సాగులో ఖర్చులు పెరిగిన దృష్ట్యా గతేడాది కన్నా సేల్ ఆఫ్ ఫైనాన్స్ను కొంతవరకు పెంచాలని అభిప్రాయపడ్డారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు గోధుమలు, కూరగాయలు, తృణధాన్యాలు, జొన్న, రాగులు పంటలకు అధిక రుణ పరిమితిని కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, రైతులకు రుణాల మంజూరు, ఫైనాన్సింగ్ విధానం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా పంటలకు సంబంధించి పంటల సాగులో పెట్టుబడులు, ఆదాయంతో పాటు వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో 20 మంది రైతులు పాల్గొని సేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచే అంశంపై అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ రావు కరీంనగర్ ఎల్డిఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, పెద్దపల్లి, సిరిసిల్ల జగిత్యాల జిల్లాల నాబార్డ్ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు, కేడీసీసీబీ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్


