బోయినపల్లి(చొప్పదండి): అప్పటిదాక బోయినపల్లి బస్టాండ్లో ఉండి అందరితో నవ్వుకుంటూ మాట్లాడిన వ్యక్తి అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. గొర్రెల మంద వద్దకు వెళ్తున్న బోయినపల్లికి చెందిన గొర్రెలకాపరి సురకాని మల్లేశం(40) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. బోయినపల్లి నుంచి వేములవాడ వెళ్లే దారిలో ఉన్న గొర్రెలమంద వద్దకు మల్లేశం సాయంత్రం తన టీవీఎస్ వాహనంపై వెళ్తున్నాడు. గుర్తు తెలియని వాహనం స్థానిక పెట్రోల్ బంక్ పరిసరాల్లో ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. మల్లేశంకు భార్య గంగజల, కుమారుడు, కూతురు ఉన్నారు. బోయినపల్లి ఎస్సై పృథ్వీధర్గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు.