సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజం. అధికారం కోసం హామీల మీద హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను వంచించింది. వంద రోజుల్లో అమలు చేస్తామని వెయ్యి రోజులైనా చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది’ అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. వారం రోజులుగా బీఆర్ఎస్ నిర్వహించిన పోరుబాట ముగింపు రోజైన మంగళవారం ఆయన కామారెడ్డిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పోరుబాటలో గులాబీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయని, ప్రజలు తమ వెంట కదం తొక్కారని గంప పేర్కొన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే అణచివేయాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాలకు నల్ల దుస్తులు ధరించి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యంగా వ్యవహరించిందని, మహిళా ఎమ్మెల్యేను అవమానించిందని ఆరోపించారు. రైతు బీమాకు ప్రీమియం చెల్లించకుండా ప్రభుత్వం రైతాంగానికి అన్యాయం చేస్తోందన్నారు. యూరియా యాప్తో రైతుల ఉసురు పోసుకుంటున్నారని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ముజీబొద్దీన్, జెడ్పీ మాజీ వైస్చైర్మన్ ప్రేమ్కుమార్, నాయకులు స్వామి, రవియాదవ్, ప్రభాకర్రెడ్డి, గోపిగౌడ్, మిన్కూరి రాంరెడ్డి, మోహన్రెడ్డి, హఫీజ్, భాను, ప్రభాకర్యాదవ్, బల్వంతరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డిక్లరేషన్ల పేరుతో
అన్ని వర్గాలను వంచించారు
హామీలు అమలయ్యేదాకా పోరాడుతాం
విలేకరుల సమావేశంలో
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్


