బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చిందని, వాటిని అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై మంగళవారం బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్నారు. బాన్సువాడ, బీర్కూర్లలో అంబేడ్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ గ్యారంటీలపై వినతి పత్రాలను అందజేశారు. అనంతరం బీర్కూర్ మున్నురుకాపు సంఘంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో బాన్సువాడ ప్రజలు కేసీఆర్ను చూసి ఓట్లేసి గెలిపిస్తే రేవంత్రెడ్డికి అమ్ముడుపోయాడని పేర్కొన్నారు. వ్యవసాయ సలహాదారుగా ఉన్న ఆయన సీఎం రేవంత్రెడ్డికి ఏం సలహాలు ఇచ్చారో ప్రజలకు తెలపాలన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో మంజూరు చేసిన నిధులతోనే బీర్కూర్, పొతంగల్ల వద్ద మంజీర నదిపై బ్రిడ్జిలు నిర్మించామని బాజిరెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాస్రావు, అంజిరెడ్డి, జుబేర్, ధర్మతేజ, సాయిబాబా, గణేష్, బాలకృష్ణ, రాములు, కృష్ణ, సంతోష్, భూమయ్య, ఎల్లప్ప, సాయిలు, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.


