● ఎమ్మెల్యే మదన్మోహన్రావు
● మున్సిపల్, ఆరోగ్య శాఖ
అధికారులతో సమీక్ష
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, ఆరోగ్యశాఖకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
అమృత్ 2.0 పథకం పనులు, వాటర్ బాడీ రిజువెనేషన్ (నీటి వనరుల పునరుద్ధరణ) పనులు, సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీలు, మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనుల ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోనే పనులను పూర్తి చేస్తామని మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టులను రద్దు చేసే చర్యలకు వెనుకాడవద్దని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.


