మద్నూర్(జుక్కల్): మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని మేనూర్లో తాళం వేసి ఉన్న ఏడిళ్లల్ల్లో చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. మద్నూర్ ఎస్సై మోహన్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. మేనూర్కి చెందిన యాదవ్రావ్ గురుజీ, కండక్టర్ ఆశోక్, అమృత్వార్ వెంకటి, గజ్జల్వార్ నాగు, ఇస్మాయిల్, మద్నూర్కు చెందిన ఉమాదేవి, రుక్మీణి ఇటీవల తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆయా ఇళ్ల తలుపులు తెరిచి ఉండటంతో స్థానికులు గుర్తించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు గురువారం అర్దరాత్రి చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మేనూర్లోని యాదవ్రావ్ గురుజీ ఇంటి తాళాలను పగలగిట్టి 20 తులాల బంగారం, రూ.లక్ష నగదు, 24 తులాల వెండి వస్తువులు చోరీ చేశారు. కండక్టర్ ఆశోక్ ఇంటి తాళాలను పగలగొట్టి 2 తులాల 8 గ్రాముల బంగారు వస్తువులు, 10 తులాల వెండి ఆభరణాలు, అమృత్వార్ వెంకటి ఇంట్లో 3 తులాల బంగారు వస్తువులు, 50 తులాల వెండి కడియాలు, రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. అలాగే గజ్జల్వార్ నాగు, ఇస్మాయిల్ ఇంటి తాళాలు పగలగొట్టినట్లు పోలీసులు తెలిపారు. మద్నూర్లోని ఉమాదేవి ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 50 వేల నగదు, రుక్మిణి ఇంటి తాళాలు పగలగొట్టి రూ.3వేల నగదు చోరీకి గురైనట్లు వివరించారు. బాధిత కుటుంబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు గ్రామాల్లో దొంగలు హల్చల్ చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. దుండగులు పగలంతా రెక్కి నిర్వహించి తాళాలు ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వరుస చోరీలతో ప్రజలు ఇళ్లకు తాళం వేసి వెళ్లాలంటేనే జంకుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు.
రెండు గ్రామాల్లోని తాళం వేసిన
ఏడు ఇళ్లల్లో చోరీ
25.8 తులాల బంగారం,
84 తులాల వెండి, రూ.1.78 లక్షల నగదు అపహరణ


