బీబీపేట: విద్యార్థే కేంద్రంగా పాఠాలు బోధిస్తున్నారు బీబీపేట టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూల రవీంద్రారెడ్డి. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా అయినప్పటికీ విద్యార్థుల కోసం పాఠశాల భవనం పైన ఉన్న గదిలో ఉంటున్నాడు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే పదో తరగతి విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి తట్టి లేపి చదువుకొమ్మని ప్రోత్సహిస్తున్నారు. డిజిటల్ విద్యకు ప్రాధాన్యత, ఎన్ఎంఎంఎస్, ఐఐఐటీ బాసర, టాలెంట్ టెస్టులు, ఒలంపియాడ్స్, క్విజ్ తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. రొబోటిక్స్పై విద్యార్థి దశ నుండే శిక్షణనిస్తున్నారు. అభ్యసనంతోపాటు వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


