నాగిరెడ్డిపేట: గ్రామాల్లో చేపడుతున్న జలసరి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి సూచించారు. శనివారం ఆయన అక్కంపల్లిలో చేపడుతున్న జలసిరి పనులను పరిశీలించారు. అనంతరం నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలసిరి పనులను వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యం ప్రకారం గ్రామాల్లో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్పిట్లు, ఫాంపాండ్లతోపాటు బోర్వెల్ రీచార్జ్ పనులు చేయించాలన్నారు. ఆయనవెంట ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో ప్రభాకర్చారి, ఏపీవో సక్కుబాయి, అక్కంపల్లి సర్పంచ్ వెంకాగౌడ్, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య తదితరులున్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఆయిల్పాం సాగుతో అధిక లాభాలను పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం మాచాపూర్లో ఆత్మ ఆధ్వర్యంలో నూనెగింజల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నూనె గింజల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఫాంపాండ్స్ నిర్మించుకొని నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శోభ, సర్పంచ్ శ్రీనివాస్, రైతులు నర్సింహారెడ్డి, అంజయ్య, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యుల పోస్టుల ఖాళీల భర్తీకి ఈ నెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.వాల్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాల ప్రాంగణంలో జరిగే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావాలని సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు–15, సీనియర్ రెసిడెంట్లు– 22, సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో జనరల్ మెడిసిన్– 2, పల్మనరీ మెడిసిన్–2, అనస్తీ షియా– 1, బ్లడ్ బ్యాంక్–1 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధనలు, పూర్తి వివరాల కోసం కళాశాల అధికారిక వెబ్సైట్ www.gmckamareddy.org లేదా 9000357799 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని ప్రిన్సిపల్ సూచించారు.
పిట్లం: తిమ్మనగర్ గ్రామంలో మద్య నిషేధం విధించారు. గ్రామంలోని సహకార సంఘం గోదాంలో శనివారం సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు సమావేశమై మద్య నిషేధంపై చర్చించారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. మద్యం విక్రయించేవారిని పట్టించేవారికి రూ.5 వేల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ను వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పునర్వ్యవస్థీకరించింది. కౌన్సిల్ నామినేటెడ్ సభ్యుడిగా కామారెడ్డికి చెందిన చిలువేరి మారుతిని నియమించింది. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్గా కొనసాగుతున్న మారుతి.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


