నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టు పరిసరాల్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవుదినం కావడంతోపాటు ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లుతుండడంతో అందాలను తిలకించేందుకు పర్యాటకులు వందల సంఖ్యలో తరలివచ్చారు. కాగా, ప్రాజెక్టు నీటిలోకి పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ కూతురి వివాహ విందుకు హాజరయ్యేందుకు ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిచ్కుందకు రానున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. బిచ్కుంద పట్టణ సమీపంలోని కాందార్పల్లి శివారులో ఏర్పాటు చేసే వివాహ విందుకు సీఎం హాజరుకానున్నారు. తన కుమార్తె వివాహ విందుకు హాజరుకావాలని ఇప్పటికే ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్ సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం రాక కోసం అధికారులు హెలిపాడ్ను సిద్ధం చేస్తున్నారు.
బాన్సువాడ : ప్రభుత్వం సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని గుడిమెట్ సద్గురు మహాదేవ స్వామిజీ అన్నారు. పట్టణంలోని రెడ్డి సంఘంలో ఆదివారం నిర్వహించిన సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభలో ఆయన ప్రసంగించారు. హిందువుల్లో ఐక్యత అవసరమని, ప్రభుత్వాలు హిందువులకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించాలని, ప్రతి ఇంటిలో భగవద్గీత ఆచరణ జరగాలని, యువత సన్మార్గంలో నడవాలని, చెడు వ్యసనాల వైపు వెళ్లవద్దని సూచించారు.మనమంతా ఒకటే భావనతో నిలవాలని వీరధర్మజ స్వామిజీ అన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నిత్యానందం, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు సాయికిరణ్, సామాజిక సమరపత ప్రముఖ హరిదాస్ తదితరులు ఉన్నారు.
బాన్సువాడ రూరల్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2000–2015 సంవత్సరాల మధ్య డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు వన్టైం చాన్స్ అవకాశం కల్పించిందని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. ఆగస్టు 31లోపు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఉందని పేర్కొన్నారు. 2016–17 సంవత్సరం నాటి డిగ్రీ సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసుకోవాలనే ఆసక్తి ఉన్న పూర్వ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కామారెడ్డి టౌన్ : జిల్లాలో కాంగ్రెస్ సేవాదళ్ను మరింత బలోపేతం చేస్తామని నూతన జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేశ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని మండల, నియోజకవర్గ కమిటీలను నియమించి ఇటీవల గాంధీభవన్లో నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు.నియోజకవర్గ అధ్యక్షుడు మెహర్ బాబా గౌడ్, పట్టణ అధ్యక్షుడు వడ్డే సుదర్శన్, ఆయా మండలాల అధ్యక్షుడు చెట్కూరి ప్రణీత్, గిజ్జువెల్లి మాధవరెడ్డి, మలోత్ మహేశ్,వేణుగోపాల్ చారి, ప్రవీణ్, కాలకుంట్ల రాజు, వడ్ల హరీష్ పాల్గొన్నారు.


