నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగితం వాగులో వరద ప్రవహిస్తోంది. మహమ్మద్నగర్ మండలం సింగితం గ్రామ రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. 15 రోజులుగా వాగులో వరద కొనసాగుతుండగా, వాగు దాటేందుకు తెప్పలను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుకు రెండు వైపులా తాడుకట్టి తెప్పపైన ప్రయాణిస్తున్నారు. వాగుపైన బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతోనే తెప్ప కష్టాలు తప్పడం లేదని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ పాలకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


