● కామారెడ్డి విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి
● తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిక
కామారెడ్డి టౌన్ : హైదరాబాద్ దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ హైస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. వివరాలు.. కామారెడ్డిలోని స్నేహపురి కాలనీకి చెందిన కిరణ్, శోభ దంపతుల కుమారుడు అభిషేక్ దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పాత కక్షలను మనసులో ఉంచుకొని శనివారం సుమారు 8 నుంచి 12 మంది తోటి విద్యార్థులు గుంపుగా చేరి అభిషేక్పై దాడికి తెగబడ్డారు. కర్రలు, ప్లేట్లతో కొడుతూ బూట్లతో ముఖంపై తొక్కుతూ గాయపరిచారు. కాగా, మెట్లపై నుంచి కింద పడిపోవడంతో అభిషేక్కు గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం నమ్మించే ప్రయత్నం చేస్తూ అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు తమ కుమారుడిని కామారెడ్డికి తీసుకొచ్చి ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తోటి విద్యార్థులే తనపై దాడి చేశారని అభిషేక్ తెలిపినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై, నిజాన్ని దాచిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


