కారోబార్లకు ప్రత్యేక హోదాపై మంత్రి హామీ
కామారెడ్డి అర్బన్: గ్రామ పంచాయతీల్లో కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న కారోబార్లకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అనసూయ హామీ ఇచ్చిందని కారోబార్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.దుర్గాగౌడ్, పిల్లి యాదగిరిలు తెలిపారు. గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రిని కారోబార్లు కలిసి మాట్లాడారు. జీవో 51 నుంచి మినహాయింపు అంశంపై కమిషనర్తో మంత్రి చర్చించినట్టు వారు పేర్కొన్నారు. ప్రతినిధులు ప్రభాకర్, నామల శంకర్ తదితరులున్నారు.
వ్యవసాయశాఖ మంత్రిని కలిసిన భిక్కనూరు నేతలు
భిక్కనూరు: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును భిక్కనూరు మండల కాంగ్రెస్ నేతలు గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, గ్రంథాలయసంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు బీంరెడ్డి నేత గూడెం శ్రీనివాస్రెడ్డిలు ఉన్నారు.
వివాహ ఆహ్వానపత్రిక అందజేత
మాచారెడ్డి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మాచారెడ్డి మాజీ జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి కూతురు వివాహ ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో కలిసి గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో అందజేశారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, నాయకులు అంజీ నాయక్,బాల్ చంద్రం,రాజాగౌడ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
నాగిరెడ్డిపేట హౌసింగ్ ఏఈగా స్వర్ణలత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల హౌసింగ్ ఏఈగా స్వర్ణలత నియమించబడ్డారు. నాగిరెడ్డిపేట మండలం హౌసింగ్ ఇన్చార్జి ఏఈగా రాజంపేట మండల హౌసింగ్ ఏఈ మహేశ్ వ్యవహరించారు. ఏఈ మహశ్కు కామారెడ్డి హౌసింగ్ డీఈఈ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు గాంధారి హౌసింగ్ ఏఈ స్వర్ణలతను నాగిరెడ్డిపేట మండలానికి బదిలీ చేశారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
దోమకొండ: మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి నుంచి సంఘమేశ్వ్ర్ రోడ్డు పానాది వరకు గురువారం సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య ప్రారంభించారు. ఆదివారం దుర్గమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున బోనాలు ఉంటాయని, జీపీ నిధులు రూ.2 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు వివరించారు. ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డుసభ్యులు, తదితరులున్నారు.
ఫెర్టిలైజర్ యాప్తో రైతులకు ఇబ్బందులు
రాజంపేట (భిక్కనూరు): ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్తో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని రాజంపేట మాజీ ఎంపీటీసీ సభ్యుడు విండో వైస్ చైర్మన్ అంద్యాల రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజంపేటలో విలేకరులతో మాట్లాడుతూ సర్వర్ లోపాలు సాంకేతిక సమస్యలతో రైతులు సకాలంలో సేవలను పొందలేకపోతున్నారన్నారు.
ఇస్కాన్ జిల్లా స్థాయి వ్యాసరచన,
ఫొటో,వీడియోగ్రఫీ పోటీలు
కామారెడ్డి అర్బన్: శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ఆధ్వర్యం లో ఈనెల 15న విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన, ఫొటో, వీడియోగ్రఫీ, హరేకృష్ణ, చాలెంజ్ టెస్ట్లు నిర్వహించనున్నట్టు ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ప్రతినిధి వెంకటదాస్ ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐతో ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు అంశంపై వ్యాసరచన (ఇంటర్,డిగ్రీ, పీజీ విద్యార్థులకు), ఆధునిక యువతకు ఆధ్యాత్మిక జీవనం అవశ్యకత అంశంపై తక్కువ నిడివిగల జన్మాష్టమి వీడియోలు రూపొందించుట, జన్మాష్టమి షార్ట్స్ (అన్ని వయస్సుల వారికి) తదితర పోటీలుంటాయన్నారు. అలాగే చిన్న పిల్లలకు కలరింగ్, డ్రాయింగ్, బొమ్మలు, వ్యాసరచన, ఆధ్యాత్మిక దుస్తుల ప్రదర్శన పోటీలుంటాయన్నారు. విజేతల కు సెప్టెంబర్ 4న నిర్వహించే కార్యక్రమంలో నగదు పురస్కారాలు అంద జేస్తామన్నారు. వివరాలకు 99129 16108 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
టాస్క్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు
కామారెడ్డి అర్బన్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) ఆధ్వర్యంలో కామారెడ్డి కర్షక్ బీఎడ్ కళాశాలలో గురువారం జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం‘జయశంకర్ సార్ వారసత్వం–నేటి తరం బాధ్యత’ అంశంపై వి ద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు టాస్క్ జిల్లా కన్వీనర్ నీల బాలు బహుమతులు అందజేశారు. ప్రతినిధులు చంద్రశేఖర్, సుధాకర్, వెంకటేశ్వర్లు, నరేందర్గౌడ్, అధ్యాపకులు విజయరామరాజు, దేవేందర్,కిషన్, భీమాగౌడ్, ప్రశాంత్ తదితరులున్నారు. కామా రెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆచార్య జయశంకర్ జయంతితో పాటు లాంచ్ గర్ల్స్ ఫౌండేషన్ ఉపాధి నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ సమన్వయకర్త దివ్య కెరీయర్ ప్రణాళిక, ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం అంశాలపై అవగాహన కల్పించారు.
కాంగ్రెస్ హయాంలోనే కాచాపూర్ విండో విలీనం
భిక్కనూరు : మండలంలోని కాచాపూర్ సింగిల్ విండోను బస్వాపూర్ విండోలో 2005లో కాంగ్రెస్ హయాంలోనే విలీనం చేశారని బస్వాపూర్ విండో చైర్మన్ మద్ది స్వామి అన్నారు. గురువారం బస్వాపూర్ సింగిల్విండో కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ 2023 మే5న ఈ విలీనంను రద్దు చేసి తిరిగి కాచాపూర్ విండో ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరాడన్నారు.దీంతో ప్రభుత్వం 2023 జూన్ 8న బస్వాపూర్ సింగిల్విండో నుంచి కాచాపూర్ విండోను వేరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఈ ఉత్తర్వులను అప్పటి జిల్లా సహకారశాఖాధికారి అమలు చేయలేదన్నారు. ఉపసర్పంచ్ కార్తిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు బుర్రిగోపాల్, కర్నల మల్లేషం, మల్లారెడ్డి, ఉదయశర్మ, భిక్షపతి, సిద్దరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోడిచిర కార్యదర్శిపై ఫిర్యాదు
మద్నూర్: కోడిచిర గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పంచాయతీకి చెందిన నిధులు సొంతం కోసం వాడుకుంటు నిధులు దు
ర్వినియోగం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు కలెక్టర్, పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్న విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు.
గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి
బీబీపేట: మాందాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం సర్పంచ్ హరీష్ యాదవ్ అధ్వర్యంలో గురువారం ప్రభుత్వ సలహాదారు మహ్మద్ ఆలీ షబ్బీర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో సీసీ రోడ్లు, పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం ఇచ్చారు. ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాకేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు లింగారెడ్డి, నక్క రవీందర్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింలు, మాధవరెడ్డి, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం
నిజాంసాగర్/లింగంపేట/భిక్కనూరు/ఎల్లారెడ్డి/బాన్సువాడ రూరల్: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని తల్లిపాలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి పేర్కొన్నారు. గురువారం నిజాంసాగర్ మండలం ఒడ్డేపల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సర్పంచ్ బొజ్జ అంజయ్య, అంగన్వాడి టీచర్లు శోభ, విజయలక్ష్మి, స్వరూప,రేఖ తదితరులు ఉన్నారు. లింగంపేట పీహెచ్సీలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో వైద్యురాలు హిమబిందు, భిక్కనూరు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ మాట్లాడారు. ఎల్లారెడ్డిలో బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యతను అంగన్వాడీ టీచర్లు వివరించారు. బాన్సువాడ మండలం తాడ్కోల్ లో సూపర్వైజర్ సౌభాగ్య, సర్పంచ్ అందె రమేశ్ మాట్లాడారు.
కరపత్రాల పంపిణీ
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో హిందూ ధర్మ జాగృతి సభ్యులు గురువారం హిందూ ధర్మ జాగృతి మహాసభకు ఆహ్వాన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహాదేవ స్వామీజీ మాట్లాడుతూ ఆదివారం బాన్సువాడలో ఈమహాసభ జరుగుతుందన్నారు.
గురుకులంలో సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి టౌన్ : భిక్కనూరు గురుకుల రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ ఇన్చార్జికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సరైన బాత్రూమ్ వసతులు లేక, నిరంతరం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి, మెదక్ జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సల్లూరి శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా కో–కన్వీనర్ కొత్తపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు.


