పశుపోషకులకు అధికారుల నోటీసులు
● దురుసుగా ప్రవర్తించిన
ఒకరిపై కేసు నమోదు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గిర్నితండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొన, నడిమి, గిర్నితండాల్లోని పశుపోషకులకు మండల పరిషత్, గ్రామపంచాయతీ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. ‘సర్వీస్ రోడ్లే పశువుల కొట్టాలు’ అంటూ సోమవారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారుల ఆదేశాల మేరకు గిర్నితండా గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరి.. పశుపోషకులకు నోటీసులు ఇచ్చారు. సర్వీస్ రోడ్లపై పశువులను కట్టేయడమే కాకుండా నోటీసు తీసుకోకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరిపై దురుసుగా ప్రవర్తిస్తూ, విధులకు ఆటంకం కల్గించాడు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి గౌరి నిజాంసాగర్ పోలీస్స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హరిసింగ్పై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.


