సంక్షిప్తం..
మండల కార్యాలయంలో ప్రజావేదిక
బాన్సువాడ రూరల్: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉపాధి హామీ ప్రజావేదికను నిర్వహించారు. ఏపీడీ వామన్రావు హాజరై వారం రోజుల పాటు ఎస్ఆర్పీ పర్యవేక్షణలో డీఆర్పీలు క్షేత్రస్థాయిలో చేపట్టిన విచారణపై చర్చించారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 వరకు బా న్సువాడ మండలంలో 4.36 కోట్ల పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. చేపట్టిన పనులకు చె ల్లించిన బిల్లులు,లేబర్పేమెంట్ తదితర అంశాలపై గ్రామ స్థాయిలో జనవరి 22 నుంచి ఈనెల 1 వరకు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారన్నారు. అవకతవకలకు పాల్పడిన వారి నుంచి నిధులు రికవరీ చేస్తామన్నారు. ఎస్ఆర్పీ మౌనిక, ఎంపీడీవో ఆనంద్, ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సోషల్ టాలెంట్ టెస్ట్లో మాచారెడ్డి
విద్యార్థినికి ప్రథమ స్థానం
మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్లో మాచారెడ్డి ఉన్నతపాఠశాల విద్యార్థిని విష్ణుప్రియ ప్రథమ స్థానం సాదించింది. సోమవారం విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. హెచ్ఎం వెంకటాచారి, గైడ్ టీచర్లు శ్యాంగౌడ్, కమల ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం సర్పంచ్ వినోద పంపిణీ చేశారు. గ్రామంలోని కొర్వి లావణ్య, గొల్ల నర్సవ్వలకు రూ.19 వేల చొప్పున మంజూరైన చెక్కులను అందజేశారు. ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులున్నారు.
సంగోజీవాడిలో..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు గైని శివాజీ అన్నారు. సంగోజీవాడిలో సోమవారం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. నాయకులు లింగం, హైమద్, లక్ష్మణ్రావు, బాలురాజు, రవి, రఫీ, ఫారూక్, సుదర్శన్, నర్సిములు, బాలునర్సు, తదితరులు పాల్గొన్నారు.
పిట్లం పంచాయతీ పాలకవర్గ సమావేశం
పిట్లం(జుక్కల్): పిట్లం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుమ్మరి శేఖర్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రా మంలో చేపట్టే పారిశుధ్య పనులు, మురికి కాల్వల నిర్మాణం, పంచాయతీ ఆదాయ, వ్యయాలు తదితరాల గురించి చర్చించారు. పలువురు పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని ఆపివేయాలని పాలకవర్గ సభ్యులు పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఉప సర్పంచ్ అవేజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఉచిత ఆటో సౌకర్యం
లింగంపేట(ఎల్లారెడ్డి): అయ్యపల్లికి చెందిన విద్యార్థులు ప్రతి రోజూ శెట్పల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడానికి సోమవారం నుంచి ఉచిత ఆటో సౌకర్యం కల్పించినట్లు సర్పంచ్ గోనె లింగం తెలిపారు. విద్యార్థులు ప్రతి రోజూ నడుచుకుంటూ కిలో మీటర్ మేర వెళ్తున్నారు. దాంతో పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడంతో తమ విలువైన చదువు కోల్పోతున్నారు. విషయం తెలుసుకున్న నూతన సర్పంచ్.. అయ్యపల్లి నుంచి శెట్పల్లి పాఠశాలకు వెళ్లడానికి ఆటోను ఏర్పాటు చేశారు.
స్థల పరిశీలన
గాంధారి: మండల పరిధిలోని నేరల్, గౌరారం గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల కోసం బుధవారం స్థలాలను పరిశీలించినట్లు ఏపీఎం ప్రసన్న కుమార్ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసి స్థలాలను ఐకేపీకి అప్పగించారని ఏపీఎం తెలిపారు. సీసీ రాములు, సిబ్బంది పాల్గొన్నారు.


