అభివృద్ధి కోసం అవకాశం ఇవ్వండి
● బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం ఆయన ఎల్లారెడ్డిలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్లకు బీఫారాలను అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాది క్రితం జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని దీంతో రాష్ట్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. వెయ్యి కోట్లు నష్ట పోయిందని పేర్కొన్నారు. నిధులు రాకపోవడంతో మున్సిపాలిటీలలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎస్డీఎఫ్ నిధులు కేటాయించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని డిమాండ్ చశారు. వరదల వల్ల ఎల్లారెడ్డితో పాటు చుట్టుపక్కల మండలాలు ఎంతో నష్టపోయాయని, బాధితులకు ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడం సిగ్గు చేటని పేర్కొన్నారు. లింగంపల్లి వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంత వరకు చేపట్టలేదన్నారు. ఎల్లారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. పట్టణ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో చర్చిస్తానన్నారు. ప్రజలు బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వినిత్ వర్మ, నాయకులు బాలకిషన్, దేవేందర్, సతీష్, రాజేష్, రవీందర్రావు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


