బెంబేలెత్తిస్తున్న వానరాలు, కుక్కలు
రామారెడ్డి: వానరమూక రోడ్డుపై తిష్ట వేసి అటుగా వెళ్లే వారిని భయాందోళనకు గురి చేస్తుండగా, మండల కేంద్రం రామారెడ్డిలో కుక్కల గుంపులు రోడ్లపై తిష్ట వేసి ప్రజలను భయపెట్టిస్తున్నాయి. రామారెడ్డిలో ఇటీవల కాలంలో 15 మందిని వీధి కుక్కలు గాయపరిచాయి. రామారెడ్డి మండలం మద్దికుంట మర్రి నుంచి రెడ్డిపేట ఎల్లమ్మ గుడి వరకు కిలోమీటర్ మేర వానరమూక గుంపులు గుంపులుగా రోజూ ఉదయం నుంచి తిష్ట వేస్తున్నాయి. దీంతో అటువైపు వెళ్లడానికి వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు పెద్ద వాహనాలు వచ్చేవరకు వేచి చూసి వాటి వెనక వెళ్తున్నారు. ఆ వానర గుంపులను నిలువరించడం ఎవరికి సాధ్యం కాకపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బెంబేలెత్తిస్తున్న వానరాలు, కుక్కలు


