లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు
● కామిశెట్టిపల్లిలో కనుమరుగైన పల్లె ప్రకృతి వనం
● పట్టించుకోని అధికారులు,
పంచాయతీ సిబ్బంది
నస్రుల్లాబాద్: గత ప్రభుత్వం హయాంలో అటవీ సంపదను పెంచాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పల్లె ప్రకతి వనాలను ఏర్పాటు చేశారు. ఒక్కో మొక్క నాటడానికి, పెంచడానికి నిధులు కేటాయించి వాటిని సంరక్షించడానికి రూ.లక్షలు వెచ్చించారు. కాని అధికారుల పర్యవేక్షణ కరువై.. పంచాయతీ సిబ్బంది పట్టింపులేని చర్యలతో ప్రభుత్వ ఆశయానికి గండి పడింది. ప్రకృతి వనంలో ఉన్న మొక్కలకు నీరు అందక ఎండి పోతున్నాయి. సాధారణంగా ఒక మొక్కను నరికితే పంచాయతీ సిబ్బంది జరిమానాలు విధించి ముక్కు పిండి వసూలు చేస్తారు. కాని వారి నిర్లక్ష్యానికి వందల సంఖ్యలో ఉన్న మొక్కలు ఎండిపోతున్నా వారిని ప్రశ్నించే వారు కరువయ్యారు. కామిశెట్టిపల్లిలో గత పాలకులు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. నస్రుల్లాబాద్ మండలం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి–765డి వెడల్పు కారణంగా ప్రకృతి వనం ఆనవాళ్లు కోల్పోయింది. కనీసం అధికారులకు మరో చోట మొక్కలను నాటించాలన్న ఆలోచన లేకపోవడం గమనర్హం.
నిర్వహణ నామ మాత్రమేనా..?
నర్సరీల్లో మొక్కలను పెంచాలని అధికారులు పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే నాచుపల్లి, నస్రుల్లాబాద్ తదితర గ్రామాల్లో పనులను వేగవంతం చేశారు. కాని కామిశెట్టిపల్లిలో మాత్రం కనీసం పంచాయతీ సిబ్బంది కన్నెత్తి చూసిన దాఖలాలే కనపడటం లేదు. ప్రస్తుతం పనులు పక్కన పెడితే గత వర్షాకాలంలో పెంచాల్సిన మొక్కలు సైతం పంచలేదని పై చిత్రం చూస్తే అర్థం అవుతుంది. నర్సరీలో ఏర్పాటు చేసిన మొక్కలు కవర్లలోనే ఎండి పోయాయి. కాని అధికారులు లెక్కల్లో మాత్రం వాటి పెంపకానికి ఖర్చులు, ప్రజలకు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం.


